Friday, July 25, 2014

ప్రయివేటు వ్యవస్థను ప్రోత్సహిస్తే... ?

        అరవై ఏళ్ళ కల సాకారం అయినవేళ.. తెలంగాణలో ప్రతి గుండె సంబురపడింది. రాష్ర్టమెలాగూ ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ అనుకూల, అననుకూల(వ్యతిరేక కాదు) వాదులందరూ బంగారు తెలంగాణను నిర్మించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాల పునాధులపై ఏర్పడిన తొలి ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల వేళ హామీల సునామీలు పోటేత్తినా.. వాటి అమలు గురించి ఇప్పుడే చర్చించుకోవడం తొందరపాటే అవుతుంది. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, పోకడ మాత్రం ఒక్కోసారి ఆందోళన కలిగిస్తోంది. రుణమాఫీ, ఫీజు రియింబర్స్ మెంట్, బ్రాండ్ అంబాసిడర్ గా సానియామిర్జా నియామకం, పలు ఛానళ్ల ప్రసారాలపై పరోక్ష పెత్తనం.. తదితర అంశాలు ఇవాళ రాష్ర్టంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఏ ముగ్గురు కలిసినా.. వీటిలో ఎదో ఒకటి చర్చించుకోవటం కనిపిస్తుంది. అన్నీ వైపుల నుంచి విమర్శలు రావడంతో ఏదో ఒక విధంగా రుణమాఫీ అమలు చేయడం ఖాయంగా తెలుస్తోంది. అయితే 1956 ముందు తెలంగాణలో ఉన్నవారి కుటుంబాలకే ఫీజు రియింబర్స్ మెంట్ అంటూ మెలకపెట్టడం కొంత వివాదానికి దారితీసే ప్రమాదం ఉంది. తెలంగాణ బిడ్డలకే రియింబర్స్ మెంటు సదుపాయం అందించాలన్న ఉద్దేశం స్వాగతించాల్సిందే. అయితే ఆ పేరుతో 1956ను మూల సంవత్సరంగా తెరపైకి తీసుకరావడం సమంజసం కాదు.  వాస్తవానికి 1956కి ముందు ప్రస్తుత మునగాల పరగణా, భద్రాచలం ప్రాంతాలు తెలంగాణలో లేవు. వాటి గురించి చర్చించకుండా ఏకపక్షంగా 1956ను ప్రామాణికంగా తీసుకోవడమే సమస్య. ఓ వైపు పోలవరం ముంపు ప్రాంతాలను అక్రమంగా కలుపుకున్నారని పక్క రాష్ర్టంపై దుమ్మెత్తిపోస్తూ... న్యాయపరంగా పోరాడతామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం.. అదే ప్రాంతాల విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ కల్పించే విషయం తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి.
          ఇక అసలు విషయానికొద్దాం. తెలంగాణ శాసనసభ, సభ్యులను కించపరుస్తూ ఓ ఛానల్ ప్రసారం చేసిన కార్యక్రమం నిజంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. చర్య తీసుకోకుండా ఉపేక్షించజాలని విషయం. అయితే ఏ చర్య తీసుకున్నా చట్టరిత్యా ప్రభుత్వ పరంగానో లేక శాసనసభా అధికారాలను ఉపయోగించి తీసుకొని ఉంటే హుందాగా ఉండేది. చర్య తీసుకునే నెపంతో ప్రయివేటు వ్యవస్థను ప్రోత్సహించడం సమంజసం కాదు. ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించుకోవడం అవసరం. నిండు సభలో ఒక ఛానల్ సభను, సభ్యులను కించపరుస్తూ కార్యక్రమాన్ని ప్రసారం చేసిందని సాక్షాత్తు సిఎం ప్రకటించారు. మరి అలాంటపుడు ఆ కార్యక్రమానికి సంబంధం లేని మరో ఛానల్ ప్రసారాలను ఎందుకు నిలిపివేయించారు? దాదాపు 50 రోజులుగా రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిచిపోవడం.. అది ప్రయివేటు వ్యవస్థ ద్వారా కావడం నిజంగా ప్రభుత్వానికే సిగ్గుచేటు. ప్రయివేటు ఆపరేటర్లు నియంత్రించలేని స్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఈ పరిణామం కేవలం రెండు ఛానళ్ళకు మాత్రమే పరిమితం అవుతుందనుకోవడం పొరపాటు. ఒక్కసారి వ్యవస్థను నియంత్రించడం అలవాటయ్యాక ఉరికనే ఉంటారనుకోవడం మన అమాయకత్వం. రేపు మరో ఛానల్ ఏదేని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం ప్రసారం చేసినా.. దాదాపు ఇటువంటి చర్యే ఉండే అవకాశం ఉండదని ఎవరైనా హామీ ఇవ్వగలరా? ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల దాకా ఎందుకు? ఏదేని ఎంఎస్ వో పైన కథనం ప్రసారం చేయాలన్న ఛానళ్ళు భయపడే పరిస్థితి నేటి ప్రభుత్వ తీరు కనిపిస్తుంది. ఇది చివరకు ఎంతవరకు వెళ్తుందో అన్నదే ఆంధోళన కలిగించే విషయం. బహుశా తమ ప్రాంతాన్ని కవర్ చేసే రిపోర్టర్ తో పొసగకపోయినా.. అతన్ని మార్చకపోతే ఛానల్ ప్రసారం ఆపివేస్తామంటే  ఛానల్ యాజమాన్యం కచ్చితంగా సంబంధిత రిపోర్టర్ ను మార్చాల్సి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇది ఒకటి, రెండు ఛానళ్లకు సంబంధించిన విషయంగా ఇప్పుడు మిగతా ఛానళ్లు భావిస్తున్నాయి. భవిష్యత్తులో తమ ఛానల్ లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రసారం చేయకుండా యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయేమో వేచిచూడాల్సిందే.

Tuesday, October 8, 2013

సీమాంధ్ర మీడియా ఉద్యమం!!

      సమైక్యవాద ఉద్యమం పేరుతో సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల పట్ల మన మీడియా వైఖరి చూస్తుంటే సిగ్గేస్తుంది.. మీడియా సంస్థలు మరీ ఇంత దారుణంగా, పక్షపాతంగా వ్యవహరిస్తాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. నేను తెలంగాణలో పుట్టినా నాకు ప్రత్యేక కాంక్ష ఏనాడూ లేదు.. ఒక తెలంగాణ బిడ్డగా మా ప్రాంత ఉద్యమం పట్ల సాధారణ సానుభూతి తప్ప ప్రత్యేక అభిమానం లేదు. నాలో ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్న వామపక్ష భావాజాలం అందుకు కారణం కావచ్చు. కానీ తెలంగాణపై కేంద్రంలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ సానుకూల ప్రకటన చేసినప్పటి నుంచి సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం, దాన్ని మీడియా కవర్ చేసే పద్ధతి చూస్తున్నప్పటి నుంచి నాలో తెలంగాణవాదం బలపడుతుంది. నాకే కాదు సీమాంధ్రలోకృత్రిమ ఉద్యమం మొదలయినప్పటి నుంచి తెలంగాణ ప్రజల్లో ఉద్యమకాంక్ష మరింత బలపడిందనేది వాస్తవం. 
     అయితే ఇన్ని సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులయిన ఉద్యమం ఎప్పుడూ కర్ఫ్యూ వరకు వెళ్ళలేదు. లూటీలు జరగలేదు. కానీ సీమాంధ్రలో ఉద్యమం ముసుగులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, లూటీలకు పాల్పడడం మనం చూస్తున్నాం. రాజీవ్ గాంధీ దారుణ హత్య, విజయవాడలో కొండవీటి మోహన రంగా హత్య సంఘటనల అనంతరం కూడా ఆ ప్రాంతాల్లో విచ్చలవిడిగా లూటీలు జరిగాయి.. ఏదైనా అల్లర్లు జరగగానే లూటీలకు పాల్పడడం ఆ ప్రాంతంలో కొంతమందికి అలవాటు లా ఉంది.. ఈ వైఖరి చూస్తే సీమాంధ్ర నేతలు దోపిడిదారులని తెలంగాణ వాదులు చేస్తున్న వాదన నిజమేనేమోనన్న అనుమానం కలుగుతుంది. 
       అయినా సంవత్సరాల తరబడి జరుగుతున్న ఉద్యమానికి కేంద్రం ఎదో ఒక రూపంలో ముగింపు పలికేందుకు ముందుకు రావడం నాకైతే సంతోషంగానే ఉంది.. అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాలలో ఏర్పడే ప్రభుత్వాల వైఖరిని బట్టి ఉంటుంది తప్పితే.. విడిపోతే అభివృద్ధి చెందుతాం.. లేదంటే కలిసుంటేనే అభివృద్ధి సాధ్యం లాంటి వాదనలు వాస్తవం కాదనేది నాకున్న నిశ్చితాభిప్రాయం. అందుకే దీర్ఘకాలంగా ఉన్న తెలంగాణ ఉద్యమానికి ముగింపు పలికేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం, కేబినోట్ లో నోట్ పెట్టడం శుభపరిణామం. అయితే తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం ప్రారంభం కావడం వెనక రహస్య ఎజెండా ఉందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణపై ఎంతోకాలంగా చర్చ జరుగుతుంటే అప్పుడు నోరుమెదపని వారు తెలంగాణ ప్రకటన వచ్చాక హడావుడి చేయడం ఎంతవరకు సమంజసమో వారే తేల్చుకోవాలి. 
       సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుందని ఊదరగొడుతున్న సీమాంధ్ర మీడియా.. అక్కడి ప్రజల అభిప్రాయాలను మాత్రం ప్రతిభింభించడంలేదని.. అక్కడివారే చెబుతున్నారు. చాలామంది ప్రజలు సమ్మెతో ఇబ్బంది పడుతూ ఉద్యమం మనకేందుకుని నిలదీస్తున్నారట.. కానీ అటువంటి వాటిని ప్రసారం చేయకుండా.. తాము చెప్పిన మాటలనే వల్లెవేసే వారి బైట్లు మాత్రమే ప్లే చేస్తున్నారు. మీడియా తలచుకుంటే తిమ్మినిబమ్మి చేయగలదన్న వాదన నిజమేనని సీమాంధ్ర ఉద్యమాన్ని చూస్తే నిజమేననిపిస్తుంది... మీరేమంటారు?

Saturday, February 9, 2013

శ్రీశ్రీ మహాప్రాస్థానం నుంచి ఓ కవిత

చిరకాలం జరిగిన మోసం ,
బలవంతుల దౌర్జన్యాలూ ,
ధనవంతుల పన్నాగాలు
ఇంకానా ! ఇకపై చెల్లవు .

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ ,
ఒక జాతిని వేరొక జాతీ ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా ? ఇకపై సాగదు .

చీనాలో రిక్షావాలా ,
చెక్ దేశపు గని పనిమనిషీ ,
ఐర్లాండున ఓడ కళాసీ ,
అణగారిన ఆర్తులందరూ ____

హటెన్ టాట్ , జూలూ , నీగ్రో ,
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యథార్థ తత్వం
చాటిస్తా రొక గొంతుకతో .

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ?
తారీఖులు , దస్తావేజులు
ఇవి కావోయి చరిత్రకర్థం .

ఈ రాణి ప్రేమ పురాణం ,
ఆ ముట్టడికైన ఖర్చులూ ,
మతలబులూ , కైఫీయతులూ
ఇవి కావొయ్ చరిత్రసారం

ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు !
దాచేస్తే దాగని సత్యం .

నైలునది నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది ?
తాజ్ మహల్ నిర్మాణానికి
రాల్లెత్తిన కూలీలెవ్వరు ?

సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహస మెట్టిది ?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ ,
అది మోసిన బోయీ లెవ్వరు ?

తక్షశిలా , పాటలీపుత్రం ,
మధ్యదరా సముద్రతీరం ,
హరప్పా , మొహెంజొదారో
క్రో – మాన్యాన్ గుహముఖాల్లో __

చారిత్రక విభాతసంధ్యల
మానవకథ వికాసమెట్టిది ?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దే పరమార్థం ?

ఏ శిల్పం ? ఏ సాహిత్యం ?
ఏ శాస్త్రం ? ఏ గాంధర్వం ?
ఏ వెల్గుల కీ ప్రస్థానం ?
ఏ స్వప్నం ?  ఏ దిగ్విజయం ?

(ఓ స్టోరీ గురించి వెదుకుతుంటే యథాలాపంగా ఈ కవిత నాకు కనిపించింది. పంచుకోవాలనిపించి పబ్లిష్ చేస్తున్నాను)

Friday, December 28, 2012

యువ చైతన్యం


       దేశ రాజదాని ఢిల్లీలో గత వారం జరిగిన సంఘటన దేశంలో మహిళల దుస్థితి ఎంత దుర్భరంగా ఉందో మరోసారి రుజువు చేసింది. ప్రభుత్వ, రాజ్యాంగ యంత్రాంగాల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీ యువత స్పందన యావత్ దేశాన్ని అబ్బురపరిచింది. ఎప్పుడు పబ్బులు, ఎంజాయ్ మెంట్ కు ప్రాధాన్యమిస్తూ పాశ్చాత్య సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే ఢిల్లీ యువతరం ఒక సంఘటనపై స్వచ్ఛందంగా రొడ్డెక్కడం, అందునా హై సెక్యూరిటీ జోన్ గా భావించే రాజ్ పథ్, విజయ్ చౌక్, రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో వేలాదిగా గుమిగూడి నిరసనకు దిగడం ఆశ్చర్యం కలిగించింది. వారి ధైర్యానికి, చొరవకు అభినందనలు. సాధారణంగా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, విజయ్ చౌక్ ప్రాంతాలలో గుంపులు గుంపులుగా ప్రజలను తిరగనివ్వరు. ఢిల్లీలో నిరసనలకు వేదికైన జంతర్ మంతర్ ను వదిలి హై సెక్యూరిటీ ప్రాంతాన్ని ఆందోళనకు ఎంచుకోవడం యువతలోని తెగింపును తెలుపుతుంది. వాటర్ కానన్లు, బాష్పవాయువులు అలవాటు లేకున్నా వాటికి భయపడకుండా ఉద్యమకారుల స్పూర్తిని చాటారు. ఇప్పటికైనా పాలకులు యువతలోని ఆగ్రహా జ్వాలలను గుర్తించి, ఆందోళన ఉదృతం కాకముందే కఠిన చర్యలు తీసుకోవాలి. హామీలతో సరిపెట్టకుండా అమలుకు చిత్తశుద్దితో కృషిచేయాలి. మహిళలను తాకాలంటేనే భయపడేలా శిక్షలు అమలు చేయాలి. అప్పుడే ఇటువంటి అకృత్యాలకు ఎంతోకొంత బ్రేక్ పడే అవకాశం ఉంది.
      ఇక విచారం కలిగించే విషయం ఏమంటే... ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన మెడి"కో' గురించి ఇక్కడి వైద్యవిద్యార్థులు ఎవరూ స్పందించకపోవడం. మెస్ ఛార్జీల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో విధులు తప్పనిసరిని వ్యతిరేకిస్తూ పేషంట్ల ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గాంధీ విద్యార్థులకు ఈ సంఘటన కనిపించలేదా? కనీసం ఖండించేందుకు కూడా మనసు రాలేదు. తమ తోటి వైద్య విద్యార్థినిపై జరిగిన అకృత్యం యావత్ దేశాన్ని ఉడికిస్తుంటే... రాష్ట్ర వైద్య విద్యార్థులు మాత్రం సిగ్గు, శరం లేకుండా తమ పని చూసుకుంటున్నారు.

Friday, December 7, 2012

తెలంగాణ... పేరే కావాలి???

           తెలంగాణ ఐకాన్... వీరవనిత... తెలంగాణ తూర్పుముక్క.... ఇలాంటి మాటలు ఎన్నో.... ఫేస్ బుక్ లో తెలంగాణ వాదుల వీర ఫాలోయింగ్... విపరీతమైన కామెంట్లు... న్యూస్ రీడర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవార్డులను తొలిసారి అందుకున్న సదరు యాంకర్  అప్పటి వరకు ఎంతమందికి తెలుసో కానీ... అవార్డు వచ్చిన తర్వాత మాత్రం పైన చెప్పిన హంగామాతో తెలంగాణలో ఆమెకు విపరీత ప్రచారం కల్పించారు. ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్ లు... టీవీలు, పేపర్లో యాడ్స్... జనాలకు ఇంత వేలం వెర్రి ఎందుకో అర్థం కాలేదు. ఎదో.. స్టేజీ మీద రెండు మాటలు మాట్లాడగానే ఆమెలో కొంతమందికి వీరతెలంగాణం కనిపించింది. తీరా ఇప్పుడు చూస్తే... తెలంగాణవాదం పక్కన పెట్టిన ఆమె రెడ్ల పార్టీలో చేరారు. ఆమెను ఆకాశానికెత్తిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో? తెలంగాణవాదం కన్న కులానికి, ఇతర అంశాలకు ప్రాధాన్యమిచ్చిన ఆ వనిత ఇంకా తెలంగాణ గురించి మాట్లాడడం శోచనీయం. పార్లమెంటులో సమైక్యాంద్ర ప్లకార్డును ప్రదర్శించిన జగన్ పార్టీ సరసన చేరిన ఆమె... తన రాజకీయారంగేట్రం తెలంగాణ కోసమేనంటే నమ్మే వెర్రి వాళ్ళు ఈ తెలంగాణలో ఎవడూ లేరు. ఇంకా నమ్మితే గొర్రే కసాయోన్ని నమ్మినట్లే. ఇక్కడ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. నిన్న జిట్టా బాలకృష్ణారెడ్డి, ఇవాళ ఆమె, రేపు ఇంకొకరు... ఇలా అందరూ తెలంగాణ వాదాన్ని వాడుకున్నది.. వాడుకుంటున్నది... తమ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ కోసం కాదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మేల్యేగా పోటీ చేయాలన్న పదవి కాంక్ష, ఆర్థిక ప్రయోజనాల కోసం సదరు యాంకర్ తెలంగాణావాదాన్ని తాకట్టు పెట్టారు. రేపు మళ్ళీ తెలంగాణ పేరుతోనే ఓట్లు అడగడానికి లో ఎటువంటి సంకోచం లేకుండా వస్తారు. 
          ఈ విషయాన్ని అమాయకులైన మా తెలంగాణ సోదరులు గుర్తించనంత కాలం ప్రతివాడు తెలంగాణ జెండా ఎత్తుకొని పబ్బం గడుపుకుంటూనే ఉంటాడు. మంత్రి పదవికి రాజీనామా చేసినా, ఐపిఎస్ గిరిని వదులుకున్నా... అన్నీ సొంత లాభాలకేనన్నది వాస్తవం. గీడ నిజమైన తెలంగాణ వాదులు ప్రజలే.. నాయకులు కాదు.. అందుకే తెలంగాణ పేరుతో పోటీ చేసే వారు ఓడిపోతే తెలంగాణవాదం ఎక్కడ వెనకపడి పోతుందోనన్న ఆందోళనతో వారి పుట్టుపుర్వోత్తరాలు చూడకుండా గెలిపించుతున్నరు. గెలిచిన వారు మాత్రం ప్రజల ఆకాంక్షను పక్కకు పెట్టి ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నరు. ఈ ప్రపంచంలో స్వార్థం లేనివాడు ఎవ్వడూ లేడు. ప్రతివాడికి ఎదో రూపంలో స్వార్థం ఉంటూనే ఉంటుంది. అయితే భయటికి మాత్రం వీర ఫోజులు పెట్టడమే బాధాకరం. తెలంగాణ పేరుతో వంచించబడుతోన్న ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించాలి. ఎవ్వనికిబడితే వాడికి తెలంగాణవాదాన్ని అన్వయించుకోవద్దని మనవి.

Monday, September 10, 2012

మళ్లీ నా చేతికొచ్చిందోచ్

            కొంత మంది మిత్రులం కలిసి ఎంతో మంచి ఆశయం కోసం ఈ బ్లాగును ప్రారంభించాము. కాని అందరివి మధ్య తరగతి బతుకులేనాయే. అందుకే ఎవ్వరం దీని మీద సరిగా ద్రుష్టి పెట్టలేక పోయాం. రెగ్యులర్గా అప్డేట్ చేయలేక పొయాం. అందరి చేతులు మారుతూ మళ్లీ నా చేతికి వచ్చింది. ఇక నుంచైనా రెగ్యులర్గా అప్డేట్ చేసేందుకు అవకాశం లభిస్తుందని ఆశీస్తున్నాను. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి.
..... మీ చందు          

Saturday, May 19, 2012

సంస్మరణ సరే... ఆచరణ మాటేమిటి?


   కమ్యూనిస్ట్ యోధుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) మూలపురుషుల్లో ఒకరైన పుచ్చలపల్లి  సుందరయ్య శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రజానేతకు స్మరించుకునేందుకు అంతకన్నా ఎక్కువ  చేసిన తప్పు లేదు. ఎందుకంటే వున్నత కుటుంబములో పుట్టినా పేదల కోసం ఉద్యమించారు. మచ్చ లేని నేతగా నిలిచారు. నిస్వార్దంగా సామాన్య జీవితం గడిపారు ఆ మహానేత.
      అయితే శతజయంతి ఉత్సవాల పేరుతో ఆ మహానుభావున్ని స్మరించుకుంటే సరిపోతుందా? అయన చూపించిన మార్గం అవసరం లేదా అనేది నేటి నేతలు ఆలోచించుకోవాలి. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేతగా వున్నా సైకిల్ మీదనే సభకు వెళ్లారు పిఎస్ (సుందరయ్య గారిని ఇష్టంగా పిలుచుకునే పేరు). కాని నేటి ఆ పార్టీ నేతలు అడంబరాలలో భుర్జువా పార్టీల నేతలతో పోటి పడుతున్నారు. ఎసి వాహనాలు లేకుంటే బయట కాలు కూడా పెట్టలేకపోతున్నారు. తమ కింది క్యాడర్ లో కూడా  అటువంటి లక్షణాలు ఉన్నవారిని మాత్రమే నేటి నేతలు గుర్తిస్తున్నారు. బయటి కార్యక్రమాలకు వారితోనే వెళ్తున్నారు. పేద కార్యకర్తల ఇంటివైపు కూడా చూడడం లేదు.  స్వార్ధం పెరుగుతుందేమో అన్న భావనతో సంతానమే వద్దనుకున్నారు పిఎస్. కానీ అయినవారు, తమ ప్రాంతం వారినే అందలమేక్కియడం, వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పడం నేడు రివాజుగా మారింది. ప్రశ్నించే వారిని కమిట్మెంట్ లేని వారిగా ప్రచారం చేస్తూ, పైపైన తిరుగుతూ పై బాధ్యుల వద్ద చెంచాగిరి చేసేవారిని వీర యోధులుగా గుర్తిస్తున్నారు. పార్టీ, ప్రజాసంఘాలు, అనుబంధ సంస్థలలోనూ ఈ వ్యాది విస్తరించి వుంది. ఉద్యమానికి ద్రోహం చేసి వెళ్ళిపోయిన వారు తిరిగి కీలక బాధ్యతల్లోకి వస్తున్నారు. ఆర్దికంగా, ఇతర  ఇబ్బందులు ఎదురైనా   దీర్గాకాలంగా ఉద్యమాన్ని అంటిపెట్టుకున్న వారిని చిన్నచూపు చుస్తున్నారనే విమర్శ ప్రతి స్తాయిల్లోను వుందని ఆ సంస్తల్లో పనిచేస్తున్న మిత్రులే స్వయంగా చెబుతున్నారు. అయితే అందరు నేతలు అలానే వున్నారని అనలేము. కాని మెజార్టీ నేతలు మాత్రం కచ్చితంగా అలానే వున్నారు.
       అయితే ప్రస్తుత  రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులును ఇందులో  మినహాహింపునివ్వొచ్చు. ఆడంబరాలకు దూరంగా, సాధారణ జీవితం గడుపుతారు. అయన మీద ఎన్ని విమర్శలు వున్నా దగ్గర నుండి ఆయనను ఎరిగిన వారికి ఆదర్శ నేతగా నిలుస్తారనడంలో  సందేహం ఉండకపోవచ్చని భావిస్తున్నాను. తరువాతి నేతలు కూడా ఆయన్ను అనుసరిస్తే ఆ మహానుభావుని ఆశయం కొంతైనా నెరవేరుతుంది.
          తమకు చెంచాగిరి చేసే లేదంటే పై స్తాయిల్లో పలుకుబడి ఉన్నవారికే పార్టీలో, ప్రజాసంఘాల్లో, పార్టీ అనుబంధ సంస్త లలో  గుర్తింపు లభిస్తుందని, అటువంటి వారికే పదోన్నతులు లభిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. విమర్సలకు మార్క్సిస్టులు ఏనాడు భయపడరు. కనీసం స్పందించరు. పాలకులపై అలుపులేని పోరాటాలు నిర్వహిస్తున్న వారిపై స్వార్ద శక్తులు విమర్శలకు దిగుతున్న నేపద్యంలో ఆ విదానం కరక్టే. కాని వాస్తవ   విమర్శలను పట్టించుకోకపోతే కింది స్తాయి క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారు. తెలిసో, తెలియకో జరుగుతున్న అటువంటి చర్యలపై పై నాయకత్వం ఆరా తీయిస్తే పార్టీకే మంచిది. చివరగా ఒక విజ్ఞప్తి.. ప్రతిభ, కమిట్మెంట్ ఉన్నవారిని గుర్తించకున్నా పెద్ద నష్టం లేదు. కానీ అది లేని వారిని తీసుకవచ్చి కీలక స్తానాల్లో కూర్చోబెట్టడం వల్ల ఆ సంస్థ అభివృద్దికి తీవ్ర ఆటంకంగా నిలుస్తుందని గుర్తించాలి. లేదంటే అంతా అయ్యాక మరోసారి 'దిద్దుబాటు' చేయాల్సి వస్తుంది. ఆ మహనీయుని దార్సనికతను, నాయకత్వ సామర్ధ్యాన్ని కనీసం ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకొని, మహాసభల్లో నిర్ణయించినట్లుగా స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు నాయకత్వం పనిచేయాలి. ఆ పనిలో నాలాంటి వారు ఎప్పుడు నూలు పోగుగా సహాయపడతారు.